
ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి
ఆశాలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి
కర్నూలు డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప డిమాండ్
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇస్తూ, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. మునెప్ప, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.దస్తగిరమ్మ,జిల్లా కార్యదర్శి డి.రమీజాబి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డి. రాధ లు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా గురువారం కర్నూలు డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఆశా వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం.నరసరావు అధ్యక్షతన భారీ ధర్నా నిర్వహించారు. .ఆశా వర్కర్స్ ను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలన్నారు. అంతవరకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. మెడికల్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సదుపాయాలు ఆశా వర్కర్లకు కల్పించాలన్నారు. 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు. సాధారణ సెలవులు, వేతనంతో కూడిన మెటర్నటీ సెలవులు ఇవ్వాలన్నారు. ఆశాలకు రికార్డులు, నాణ్యమైన యూనిఫామ్ సరఫరా చేయాలన్నారు. గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలన్నారు. డిఎం అండ్ హెచ్ఓ సంతకంతో కూడిన గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. యాప్ లలో సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి కనీసం 5జి ఫోన్లు ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను భర్తీ చేసి పని భారం తగ్గించాలన్నారు. ఏ.ఎన్.ఎం,జి.ఎన్.ఎమ్ పూర్తిచేసిన ఆశా కార్యకర్తలకు ఉద్యోగ సర్వీసును అప్రెంటిస్ప్ గా పరిగణించి ఏఎన్ఎం గా పదోన్నతి కల్పించాలన్నారు. రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు, నెలకు పెన్షన్ 10 వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. ఆశా కార్యకర్త డ్యూటీలో మరణిస్తే ఎక్స్గ్రేషియా 5 లక్షలు చెల్లించాలన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, మరణించిన ఆశాల దహన సంస్కారాలు ఖర్చులకు గాను 20 వేలు ఇవ్వాలన్నారు. ఆశాలకు ప్రమాద బీమా 10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉచితంగా ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న లెప్రసీ, టీబి, కరోనా అలవెన్స్ బకాయిలు ఇవ్వాలన్నారు. ఆశా కార్యకర్తలకు సంబంధం లేని పనులు చేయించరాదని వారు డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలపై రాజకీయ నాయకులు వేధింపులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి జి. చంద్రశేఖర్,ఏఐటీయూసీ జిల్లా నాయకులు కృష్ణమూర్తి, బతకన్న, ఆశ యూనియన్ నాయకులు తులసమ్మ, నాగలక్ష్మి, రాధిక,రాధ,అరుణ, సువర్ణ, నాగలక్ష్మి, హైమావతి, సుజాత, కృష్ణవేణి, విజయలక్ష్మి, రాజమ్మ, కాంతమ్మ, జైనబీ, లక్ష్మీ ప్రసన్న, అనసూయ, సరోజ, అరుణ, జ్యోతి,మీనా, వరలక్ష్మీ,రామక్క,శివమ్మ, తదితరులు పాల్గొన్నారు.