శ్రీశైల మల్లన్న దర్శనం పలు జన్మల పాప పరిహారం..!

శ్రీశైల మల్లన్న దర్శనం పలు జన్మల పాప పరిహారం..!

న్యూస్ వెలుగు, శ్రీశైలం: మల్లికార్జునస్వామి ఆలయం చుట్టూ ఎత్తైన గోడ వుంది.ఈ గోడ సుమారు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయ ప్రాకారం చుట్టూ 8 దిక్కులలో అష్టభైరవులు ప్రతిష్టులైయున్నారు.ఈ దేవాలయానికి నాలుగు వైపులా గోపురాలు ఉన్నాయి. శ్రీ మల్లికార్జునస్వామి ఆలయం       తూర్పుముఖంగా వుంది. గర్భాలయం చిన్నది.గర్భాలయంలోని 6 అంగుళాల ఎత్తు, 8 అంగుళాల వెడల్పు వున్న శివలింగమే మల్లికార్జున శివలింగం. మల్లికార్జున దేవాలయంలో కళ్యాణమండపం ప్రసిద్ధి చెందింది. ఇది విశాలమైన ప్రదేశం. ఇక్కడ లోకకళ్యాణార్థం మల్లికార్జున, భ్రమరాంబల కళ్యాణం, నిత్యం జరుగుతుంది.భ్రమరాంబికా దేవాలయం స్థలపురాణం..!సతీదేవి ఖండితాంగాలలో మెడ భాగము ఈ శ్రీశైల క్షేత్రమునందు పడినది. అష్టాదశ శక్తిపీఠములలో ఒకటి ఈ బ్రమరాంబ శక్తిపీఠము. శ్రీశైలంలో భ్రమరాంబికా అవతరణ గురించి ఒక పురాణ కథ వున్నది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు వుండేవాడట. అతడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకొని ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ఏమిటి అంటే స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఏ ఆయుధాలు తనను సంహరించలేకుండా వుండడమే ఆ వరం. దానితో అరుణాసురుడు, మానవులను, దేవతలను బాగా హింసించాడు. అప్పుడు దేవతలంతా సమస్య పరిష్కారానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థిస్తారు.అంబ యజ్ఞం’ చేయమని వారికి త్రిమూర్తులు సూచిస్తారు.దేవతలు ఆ యజ్ఞాన్ని చేస్తూ వుండగా కోట్లాది భ్రమరాలు (తూనీగలు) అరుణాసురుడిని కుట్టి చంపేస్తాయి. అప్పుడు దేవతలు సంతోషించి యజ్ఞంలో నుండి ఉద్భవించిన భ్రమరాంబా అమ్మవారిని ప్రజల సంరక్షణార్థం, భూలోకంలోనే వుండమని ప్రార్థిస్తే ఆమె శ్రీశైలంలో నివాసం ఏర్పరచుకుందట.శ్రీ మల్లికార్జునస్వామి వారి ఆలయం వెనుక ఎత్తైన ప్రదేశంలో భ్రమరాంబికా దేవాలయం వున్నది.ఈ దేవాలయం బయట కుడివైపు భాగంలో చెవిని గోడకు ఆనిస్తే భ్రమరగీతం వినిపిస్తుంది. ఈ భ్రమరగీతం భ్రమరాంబికా దేవి ఇక్కడ ఆసీనురాలైవుందని తెలియజేస్తుంది. గర్భగుడిలో ఉన్న భ్రమరాంబ ఉగ్రరూపిణి భయంకరంగా కనిపిస్తుంది.ఎనిమిది చేతులతో ప్రతి చేతిలో ఒక ఆయుధంతో కనపడుతుంది.మహిషాసురమర్దిని రూపంలో భ్రమరాంబ దర్శనమిస్తుంది. ఉత్సవాలల్లో వూరేగించే దేవి సౌమ్య స్వరూపిణి. అందమయిన అలంకరణతో ఈ విగ్రహాన్ని వూరేగిస్తారు.గర్భగుడిలో బ్రాహ్మణ పూజారులు దేవికి పూజలు చేస్తారు.గర్భగుడిలోని విగ్రహానికి సందర్శకులు పూజచేయడాన్ని అనుమతించరు. గర్భగుడి ప్రవేశద్వారం దగ్గరే భక్తులు శ్రీచక్రానికి, కమల పీఠానికి కుంకుమపూజ చేస్తారు. ఇక్కడ వున్న కమలపీఠం మీద కూర్చొని భ్రమరాంబికా దేవి తపస్సు చేసిందట.
ఆలయ చరిత్ర..!నల్లమల లోతట్టు ప్రాంతం అయినా భౌరాపూర్‌ చెరువు దగ్గర వెలసిన భ్రమరాంబ అమ్మవారికి చాళుక్యులు, రెడ్డిరాజులు మరియు విష్ణుకుండినుల పాలనలో ఈ దేవాలయం నిర్మించబడిందని చరిత్ర చెప్తున్నది.
ఆదివాసీల సోదరి అయిన భ్రమరాంబికను పరమేశ్వరుడు వివాహం చేసుకోవడం వలన చెంచు గిరిజనులు ఈశ్వరుడిని బావగా పిలుచుకొంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు.మహాశివరాత్రి రోజున పూర్వంనుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కల్యాణంచేసే పద్ధతి నేటికీ కొనసాగుతోంది.ఈ ఆలయాన్ని పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు సందర్శించి పూజలు చేసారని చరిత్ర చెబుతుంది. శ్రీ శ్రీశైల ఆలయాన్ని రక్షించడానికి, కొంతమంది రాజులు ఆలయం చుట్టూ కోటలాంటి నిర్మాణాన్ని నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారాలు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తి పీఠములలో ఒకటి.
శ్రీశైలం దగ్గర దర్శనీయ ప్రదేశాలు..!పాతాళ గంగ..!శ్రీశైలంకు 3 కి.మీ. దూరంలో వున్నది. కాని ఇక్కడ శ్రీశైలము ప్రదేశం చాలా ఎత్తులో ఉన్నది, కృష్ణానది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. ఇక్కడ సుమారుగా 900ల మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదిని ఇక్కడ పాతాళగంగ అనే పేరుతో పిలుస్తారు.
సాక్షి గణపతి ఆలయం..!ఈ సాక్షి గణపతి ఆలయం ప్రధాన ఆలయానికి 2 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయ ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినట్లు, మనము శ్రీశైలము వచ్చినట్లు కైలాసములో గణపతే సాక్ష్యము చెపుతాడు. అందుకని ఇతనిని సాక్షి గణపతి అని అంటారు.
శిఖరేశ్వరాలయం..!ఈ ఆలయ శ్రీశైలంలో ప్రత్యేకమైనది ఈ శ్రీశైలశిఖరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరం వైపు చూడటం కాదు.దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరంపై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తి పొందుతారని త్రేతాయుగంలో శివదర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే నేటి శిఖరేశ్వరం.ఆనాటి నుండి నేటివరకూ శిఖరేశ్వరం నుండి శ్రీశైల ఆలయం శిఖరము చూసే సంప్రదాయం కొనసాగుతున్నది.శ్రీశైల మల్లికార్జునస్వామి భ్రమరాంబిక దేవి ఆలయం/స్థలపురాణం..ఈ శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలో కృష్ణానదికి కుడి వైపున ఉంది.శ్రీశైలం క్షేత్రంలో వెలిసిన భ్రమరాంబిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరు.మరియు శ్రీ మల్లికార్జునస్వామి వారు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకరు.అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని శ్రీగిరి, శ్రీ పర్వతం, శ్రీ నగరం అని కూడా పిలుస్తుంటారు. కర్నూలు నుండి శ్రీశైలం 178 కి.మీ. హైదరాబాదు నుంచి శ్రీశైలంకు 232 కి.మీ. విజయవాడనుండి శ్రీశైలం 260 కి.మీ. ఈ శ్రీశైల క్షేత్రం సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో వుంది.ఇలా ఒకే చోట ద్వాదశజ్యోతిర్లింగాలు మరియు శక్తిపీఠలు కలసి వున్నవి మూడు వున్నాయి. అందులో శ్రీశైలం మల్లికార్జునస్వామి జ్యోతిర్లింగం మరియు భ్రమరాంబ అమ్మవారి శక్తిపీఠం, రెండవది కాశీ, ఇక్కడ విశ్వేశ్వరస్వామి జ్యోతిర్లింగం మరియు విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం, మూడవది ఉజ్జయిని ఇక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మరియు మహంకాళీ అమ్మవారి శక్తిపీఠం.

శ్రీశైలానికి పూర్వం నాలుగు ప్రధాన మార్గాలుండేవి, వాటినే శ్రీశైల ద్వారాలు అనేవారు.
అవి..
1. త్రిపురాంతకం,
2. సిద్ధవటద్వారం,
3. అలంపురం మరియు
4. ఉమామహేశ్వరం.

త్రిపురాంతకద్వారం శ్రీశైలానికి తూర్పు ద్వారం. సిద్ధవటం కడప జిల్లాలో వుంది. ఈ రెండవ ద్వారం దక్షిణ ద్వారం. మూడవ ద్వారమయిన అలంపుర ద్వారం మహబూబ్ నగర్ జిల్లాలో వున్నది.ఇది పశ్చిమద్వారం. ఉమామహేశ్వరం నాల్గవ ద్వారం. ఇది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది.ఇది ఉత్తర ద్వారం. పూర్వం అడవుల్లో కొండలమీద, రోడ్లు లేనప్పుడు, బండ్లమీద, లేక కాలినడకన ఈ మార్గం ద్వారా శ్రీశైలం చేరుకునేవారు. ఆ రోజుల్లో శ్రీశైలం చేరడం చాలా కష్టంగా ఉండేదట. ఇప్పుడు అడవుల్లో కొండలమీద బస్సులు వెళ్లడానికి రోడ్డు వేసిన తర్వాత సులాభంగా శ్రీశైలం చేరుకోవచ్చు.
స్థలపురాణం..!
కృతయుగములో శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తికోసం ఘోరమైన తపస్సు చేస్తాడు.తన తపస్సును మెచ్చిన శివుడు శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరు కుమారులు ప్రసాదిస్తాడు. వారిలో నందీశ్వరుడు అనే అతను కూడా శివుడి కోసం తపస్సు చేసి సేవచేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించాలని కోరుకుంటాడు. అలాగే అతని వాహనంగా ఉండేలా వరం పొందాడు. ఆ విదంగా శివుడున్న ప్రతిచోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు..అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడికోసం తపస్సుచేసి ఆయననుశివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలావరంపొందుతాడు.శివ పార్వతులు వెలసిన పర్వతమే శ్రీపర్వతం అయ్యింది. తర్వాత అది రానురాను శ్రీశైలంగా మారింది.
మరొక కథనం ప్రకారం..!పూర్వకాలంలో కృష్ణానది తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకొని చంద్రకేతుడనే రాజు పరిపాలించేవాడు.వారు సంతానం కోసం పరితపిస్తున్న ఆ రాజుకు ఒక అమ్మాయి జన్మించింది. ఆమెకు చంద్రమతి అనే పేరుపెట్టారు. ఆమె పుట్టిన తర్వాత రాజపురోహితులు అతని జైత్రయాత్ర ముహూర్తం పెట్టారు.చంద్రకేతుడు బ్రహ్మగిరి నుంచి మొదలుపెట్టిన జైత్రయాత్రను రాజ్య విస్తరణ కోసం కొన్నేళ్లపాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు.

అలా కొంత కాలం గడిచిన తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్ర ముగించి, తిరిగి బ్రహ్మగిరి రాజ్యానికి చేరుకున్నాడు. అప్పుడు అంతఃపురంలో ఓ అందమైన కన్యను చూసి చంద్రకేతుడు మనసు పారేసుకొని ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంటపడతాడు. అది చూసిన అతని భార్య ఆమె మరెవరో కాదు, మన కూతురు చంద్రమతి అని చెప్పినా చంద్రకేతుడు పట్టించుకోలేదు. చంద్రమతి చేతులు జోడించి ‘నేను మీ కుమార్తెను నన్ను వదిలిపెట్టండి అని వేడుకున్నా అతను కామంతో ఆమెను లోబరుచుకోడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఆమె బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి నల్లమల కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఓ గుహలో దాక్కుంటుంది. దీంతో ఆమె కోసం చంద్రకేతుడు ఆ గుహ బయటే కాపు కాసాడు. శివ భక్తురాలైన చంద్రమతికి మరోదారిలేక తన తండ్రి నుంచి తనను కాపాడాలని శివుడిని ప్రార్థించింది. ఆమె ప్రార్ధనను మొరాలకించిన శివుడు చంద్రకేతుడిని ఆకుపచ్చ శిలగా మార్చేశాడు. ఆ శిల దొర్లుకుంటూ పోయి పాతాళగంగలో పడింది. అందువల్లే అక్కడి నీరు పచ్చగా ఉంటాయని భక్తులు నమ్ముతారు.గుహ నుంచి బయటకు వచ్చిన చంద్రమతి ఇక్కడ ఒక అద్భుతాన్ని చూస్తుంది. ఒక ఆవు పొదుగు నుంచి కారుతున్న పాల ధారతో పొదల్లో అభిషేకం అవుతున్న శివలింగాన్ని చూసి, అప్పుడు ఆమె ఆ శివలింగానికి ఆలయాన్ని నిర్మించి స్వామివారిని నిత్యం మల్లెపూలతో పూజ చేసేది. ఆమె భక్తిని మెచ్చిన శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు చంద్రమతి మీరు ఇక్కడే వెలసి ఉండాలని కోరుకుంటుంది. అందుకే ఆ ఆలయానికి మల్లిఖార్జునస్వామి ఆలయంగా పేరొందిందని పూర్వికులు చెబుతారు.
ఆలయ వర్ణన..!శ్రీ మల్లికార్జునస్వామి వారి ఆలయం శిఖరేశ్వరాలయంలో కొలువుతీరిన వీరశంకరుడు కాలక్రమంలో శిఖరేశ్వరుయ్యాడు. ఆలయం ఎదురుగాగల క్రీ.శ. 1398 నాటి శాసనాన్ని బట్టి అప్పటికే ఈ శిఖర మీదకి భక్తులు వెళ్ళే ఆచారం ఉన్నట్లు తెలుస్తుంది.
ఫాలధార పంచధారలు..!
మల్లికార్జునస్వామి వారి ప్రధాన ఆలయం నుండి
3 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటకేశ్వరము సమీపంలో అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉంది.ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులులనుండి పంచధార (ఐదుధార)లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఎండవానలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ స్థలం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక్కొక్కథార ఒక్కొక్క రుచితో నుండుట. ఒకథార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది. ఈ జలధారలు ఆరడుగులు మాత్రమే ముందుకు ప్రవహించి అక్కడే ఇంకి పోవడం విశేషం.

హటకేశ్వరం..!హటకేశ్వరం ఆలయం శ్రీశైలం నుండి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హఠకేశ్వరుడు అద్భుతమైన దృశ్యాల మధ్య కొలువై కనిపిస్తారు. ఈ పరిసరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివసించారు. పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు.రానురాను అది మెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది.ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు.
మేదిచెట్టు..!శ్రీశైలం వచ్చిన భక్తులు ఈ మెడిచెట్టును సందర్శించి చెట్టు చుట్టూ ప్రదక్షణలు తిరుగుతారు. ఈ చెట్టు మూడు చెట్ల కలయిక. ఇందులో మెడి, జువ్వి మరియు రావి చెట్లు కలిసి ఉన్నాయి. ఈ చెట్టు చాలా ప్రాచీనమైన చెట్టు. ఈ చెట్టుకు ప్రదక్షణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.దత్తాత్రేయ మహర్షి ఈ చెట్టు దగ్గర తపస్సు చేసాడట.
క్షేత్రపాలకుడు..!ఈ శ్రీశైల క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి.ఈయన ఆలయం పోస్టాఫీసు దగ్గరలో వున్నది.ఈ వీరభద్రస్వామి దేవాలయానికి పైకప్పు లేదు. అందువలన ఈ వీరభద్రస్వామి బయలు వీరభద్రస్వామి అంటారు. ఇక్కడ వీరభద్రస్వామి విగ్రహంతోపాటు, భద్రకాళి విగ్రహం అమ్మవారి కూడా వున్నది.
గ్రామదేవత..!శ్రీశైలానికి గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారు. కరివెనవారి సత్రం ఎదురుగా అంకాళమ్మ అమ్మవారి ఆలయం వున్నది. గ్రామదేవతను దర్శించుకొని ఇతర దేవతల దర్శనానికి వెళ్ళడం ఇక్కడి సాంప్రదాయం.

Author

Was this helpful?

Thanks for your feedback!