
ఆస్తి పన్నుపై 5% రాయితీ సద్వినియోగం చేసుకోండి
పన్నుదారులకు కమిషనర్ యస్.రవీంద్ర బాబు విజ్ఞప్తి
నగరపాలక కార్యాలయంలో పన్ను వసూలు కేంద్రం పరిశీలన
నగరపాలక సంస్థ, కర్నూలు; భవన, ఖాళీ స్థలాల యజమానులు సత్వరమే ఆస్తి పన్నులు చెల్లించి 5% పన్ను రాయితీ పొందగలరని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు పన్నుదారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రాన్ని పరిశీలించారు. పన్ను చెల్లింపుదార్లతో మాట్లాడి, సదుపాయాల కల్పనపై ఆరా తీశారు.అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ఈ నెల 4 రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 267 జారీ చేసిందని, దాని ప్రకారం 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 30 లోపు నగరంలోని భవనాలు, ఖాళీ స్థలం పన్నులను చెల్లించిన వారికి 5% రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు. అన్లైన్లో సోమవారం డిమాండు జనరేట్ చేయగా, రెండు రోజుల్లోనే పన్నుదారులు రూ.2.5 కోట్లు పన్నులు చెల్లించడం హర్షణీయం అన్నారు. త్వరలో నగరంలో మరో మూడు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఆన్లైన్లో సైతం పన్నులను చెల్లించవచ్చని, ఆస్తి పన్నుతో పాటు ప్రజలు తాగునీటి కొళాయి చార్జీలను సైతం చెల్లించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో పన్నులు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి తాగునీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. సకల సౌకర్యాలు కల్పిస్తున్న నగరపాలక సంస్థకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కమిషనర్ కోరారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, మేనేజర్ యన్.చిన్నరాముడు, ఆర్ఓ జునైద్, తదితరులు పాల్గొన్నారు.