
నాకు ఓటు వేయని ఎస్సీలకు ఏ మంచి చేయొద్దు.. టీడీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
గుంటూరు, న్యూస్ వెలుగు; తనకు ఓటు వేయని ఎస్సీలకు ఏ మంచి చేయవద్దని ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ ఇది మంచి ప్రభుత్వం ‘ పేరిట గుంటూరు జిల్లా పెదగొట్టిపాడులో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రామాంజనేయులు మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన ఎస్సీలకు మాత్రమే ప్రయోజనాలు కల్పించాలని నాయకులకు సూచించారు.
అందరికీ ప్రయోజనాలు అందజేసిన తర్వాత మిగిలితే.. అప్పుడు కూడా తాను ఒప్పుకుంటేనే మిగిలిన వారికి ఇవ్వాలని నాయకులకు బూర్ల రామాంజనేయులు సూచించారు. అలా కాకుండా స్వతహాగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అస్సలు ఒప్పుకోనని.. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గొట్టిపాడులో తనకు ఇతరులు మంచి మెజార్టీనే ఇచ్చారని.. కానీ సొంత సామాజికవర్గంలోనే తనను గుర్తించలేదని రామాంజనేయులు అన్నారు. ఇది సిగ్గుగా ఉందని.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. ఇప్పటివరకు తమ మంచినే చూశారని.. అక్టోబర్ 2 తర్వాత తమ సిసలైన పాలన చూస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మండిపడింది. ఇదేనా పారదర్శక పాలన అంటే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించింది.