ఐఏఎస్‌లకు చుక్కెదురు.. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులకు క్యాట్‌ నో..!

ఐఏఎస్‌లకు చుక్కెదురు.. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులకు క్యాట్‌ నో..!

  అమరావతి;  తెలంగాణ కేడర్‌ నుంచి ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌ అధికారులకు చుక్కెదురైంది. పలువురు ఐఏఎస్‌ అధికారులను ఏపీకి కేటాయిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, డీవోపీటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాణిప్రసాద్‌, వాకాటి కరుణ, సృజన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఐఏఎస్‌ అధికారుల పిటిషన్లపై మంగళవారం క్యాట్‌ విచారణ జరిపింది. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఐఏఎస్‌ అధికారుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు క్యాట్‌ ఎదుట వాదనలు వినిపించారు. డీవోపీటీ ఉత్తర్వులు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ నెల 16న డీవోపీటీ రిలీవ్‌ కావాలని డీవోపీటీ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఐఏఎస్‌ల అభ్యర్థనలను డీవోపీటీ పరిశీలించాల్సి ఉందని.. డీవోపీటీ నేరుగా నిర్ణయం తీసుకోకుండా వన్‌మెన్‌ కమిటీని నియమించిందని తెలిపారు.

ఐఏఎస్‌ల కేటాయింపు నిర్ణయాధికారం డీవోపీటీకే ఉందని న్యాయవాదులు క్యాట్‌కు తెలిపారు. వన్‌మెన్‌ కమిటీ సిఫారసును డీవోపీటీ ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. డీవోపీటీ వన్‌మెన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను ఐఏఎస్‌లకు ఇవ్వలేదని.. ఐదుగురు ఐఏఎస్‌లకు కమిటీ నివేదికను చూపలేదన్నారు. కమిటీ నివేదిక ఇవ్వకుండానే డీవోపీటీ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. క్యాట్‌ స్పందిస్తూ.. వరదలతో ఏపీ ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని.. వరద ప్రాంతాలకు వెళ్లి సేవ చేయాలని లేదా? అని ప్రశ్నించింది. వన్‌మెన్‌ కమిటీని డీవోపీటీ వేసినప్పుడు ఎందుకు స్పందించలేని.. అసలు నివాసానికి అర్థం ఏంటో చెప్పాలని.. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ఎందుకు దాఖలు చేయలేదంటూ ప్రశ్నిస్తూ.. ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. బుధవారం యధావిథిగా ఐఏఎస్‌ అధికారులంతా రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

అలాగే, వన్‌మెన్‌ కమిటీ రిపోర్టును సమర్పించాలని సూచించింది. విచారణను నవంబర్‌కు వాయిదా వేసింది. క్యాట్‌ ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ నుంచి రిలీవ్‌ కానున్న అధికారుల జాబితాలో ఆమ్రపాలి కాట, రొనాల్డ్‌ రోస్‌, వాకాటి కరుణ, వాణిప్రసాద్‌, సృజన, హరికిరణ్‌, శివశంకర్‌ ఉన్నారు. క్యాట్‌లో ఊరట దక్కకపోవడంతో అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. డీవోపీటీ ఉత్తర్వులపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేంద్రం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కేంద్రం సర్దుబాటు చేసింది. ఈ సమయంలో ఐఏఎస్‌ అధికారులను ఏపీ, తెలంగాణ కేడర్‌లకు కేటాయించింది. అయితే, ఇందులో కొందరు అధికారులు తమను ఏపీ కేడర్‌కు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల అభ్యంతరాలను తిరస్కరించిన డీవోపీటీ ఇటీవల ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!