
భారత్ బ్రాండ్ను విస్తరించిన కేంద్రం.. సామాన్యులకు ఊరట..!
నేషనల్ ; కేంద్రం సామాన్యులకు ఊరట కలిగించే వార్త చెప్పింది. రాయితీపై పప్పులను అందించేందుకు ‘భారత్’ బ్రాండ్ను విస్తరించింది. ఇందులో తృణధాన్యాలు, మసూర్ దాల్ని చేర్చింది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఊరట కలించే ప్రయత్నంలో భాగంగా రిటైల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం భారత్ బ్రాండ్ రెండో దశను ప్రారంభించారు. కో ఆపరేటివ్ నెట్వర్క్స్, ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్ ద్వారా చనా కిలోకు రూ.58, మసూర్ దాల్ను పప్పు కిలోకు రూ.89కి రిటైల్లో విక్రయించనున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. బఫర్ స్టాక్ నుంచి సబ్సిడీ ధరకే విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సహకార సంఘాలకు 3లక్షల టన్నుల చనా, 68వేల టన్నుల మసూర్ దాల్ను కేటాయించింది. కార్యక్రమంలో వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు బీఎల్ వర్మ, నిముబెన్ జయంతిభాయ్ బంభానియా పాల్గొన్నారు.
ఎన్సీసీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనీస్ చంద్ర జోసెఫ్ మాట్లాడుతూ తొలుత ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పథకం కింద భారత్ బ్రాండ్ ఉత్పత్తులను పదిరోజుల్లో దేశవ్యాప్తంగా రిటైల్ చేయాలనేది ప్లాన్ అని తెలిపారు. చనాకు భారీగా డిమాండ్ ఉన్నందున సబ్సిడీ కింద అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లు, రిటైల్ స్టోర్లతో రీచ్ను విస్తరించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. భారత్ బ్రాండ్ తొలి దశను కేంద్రం గతేడాది అక్టోబర్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. బియ్యం, గోధుమ పిండితో పాటు పప్పులను ప్రభుత్వం రిటైల్ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలి దశలో భారత్ బ్రాండ్ పిండిని కిలోకు రూ.30, కిలో బియ్యం రూ.70, పప్పులను రూ.93కే విక్రయించింది. అలాగే మార్కెట్లో పెరుగుతున్న ఉల్లిగడ్డలను అరికట్టేందుకు ప్రభుత్వం కిలోకు రూ.35, టమాట రూ.65కే అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఈ ఏడాది పప్పుధాన్యాల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.