
రాంపల్లి గ్రామంలో ఘోరం
భార్యను గొంతుకోసి చంపిన భర్త
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలంలోని రాంపల్లి గ్రామంలో బుధవారం మిట్ట మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంట్లో ఎవరులేని సమయంలో ఏకాశి రామానాయుడు తన భార్య అయినటువంటి ఏకాసి సరోజ (35) ను దారుణంగా కిరాతకంగా కత్తితో గొంతుకోసి చంపిన ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్ళగా రాంపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న ఏకాశీ రామానాయుడు గత 15 ఏళ్ల క్రితం రామలింగయ్య పల్లి గ్రామం నుంచి సరోజను వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.గత ఐదేళ్ల క్రితం భార్య భర్తలకు తరచూ గొడవ పడి ఇద్దరు విడిపోయారు.వీరు ఇద్దరు విడిపోయి విడాకులు తీసుకోక మునుపే రామానాయుడు పత్తికొండ మండలం పరిధిలోని చక్రాల్ల గ్రామం నుంచి మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇలా మూడేళ్లు గడిచిన తరువాత రామానాయుడు పెద్ద భార్య అయినటువంటి సరోజపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు.ద్వేషం పెంచుకున్న రామానాయుడు బుధవారం మిట్ట మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న తన పెద్ద భార్య సరోజను అతి క్రూరంగా గొంతుకోసి చంపడంతో ఆమె అక్కడికక్కడే తుది శ్వాస విడిచింది.కట్టుకున్న మొగుడే చివరకు కాలయముడు అయ్యాడని రాంపల్లి గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న సిఐ పులి శేఖర్, ఎస్సై కృష్ణమూర్తి తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు.