
తుగ్లక్ నిర్ణయాలతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది : ఏపీ మంత్రి పార్థసారథి
అమరావతి : వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాలనపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు
వైసీపీ అసంబద్ద నిర్ణయాలతో జరిగిన నష్టాన్ని వివరిస్తూ విమర్శలు చేశారు. రాజధాని అమరావతిని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అంతర్జాతీయస్థాయిలో తెలుగు ప్రజలు గర్వపడే విధంగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. దాంట్లో భాగంగానే ప్రపంచబ్యాంక్ , హడ్కో, కేడబ్ల్యూఎఫ్ నిధులతో రూ. 33,137 కోట్లతో 45 ఇంజినీరింగ్ పనులు చేపట్టేందుకు ఏపీసీఆర్డీఏకు కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు.
గత జగన్ రెడ్డి ప్రభుత్వం, స్వచ్ఛమైన త్రాగు నీటి కోసం, కేంద్రం అందించిన జల్ జీవన్ మిషన్ ని నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. నాడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష నుంచి లక్షన్నర కోట్లు ఈ పథకం కింద నిధులు కేంద్రం నుంచి తీసుకోగా జగన్ సర్కార్ కేవలం రూ. 27 వేలు కోట్లు మాత్రమే తీసుకుని వాటిలో కేవలం రూ. 4వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని వెల్లడించారు.
475 జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
475 జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించే పథకానికి ఆమోదం తెలిపినట్టు వివరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1.41 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుందని తెలిపారు. క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టే పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుదుత్పత్తి యూనిట్ల స్థాపనకు నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.