
సంత జూటూరులో పడకేసిన పారిశుధ్యం.. బురదతో కంపుకొడుతున్న వీధులు..
దుర్వాసనతో అవస్థలు పడుతున్న విద్యార్థులు వృద్ధులు మహిళలు
పట్టించుకోని పంచాయతీ అధికారులు
బండి ఆత్మకూరు, వెలుగు న్యూస్: మండలంలోని సంతజూటూరు గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో ఎక్కడపడితే అక్కడ మురుగు నిలిచి బురదతో వీధులలో కంపుకొడుతున్నాయి. గ్రామంలో మురుగు కాలువలు లేకపోవడంతో రోడ్లపై నీరు పారి చెరువులను తలపిస్తున్నాయి. పట్టించుకోవాల్సిన పంచాయతీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
గ్రామాల్లో పారిశుధ్యం, మొక్కల పెంపకం, విధి దీపాల నిర్వహణ, ఇతర ఆదాయాల సేకరణ గ్రామ పంచాయితీల ప్రధాన బాధ్యత. కానీ సంతజూటూరు గ్రామంలో మాత్రం పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అస్తవ్యస్తంగా తయారైంది. పంచాయతీ అధికారులు పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారు. అందుకు సంత జూటూరు ప్రథమ స్థానంలో ఉంది.
ఎక్కడ చూసినా మురుగునీరు దర్శనమిస్తున్నాయి. దీంతో దోమల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. పారిశుద్ధ్యానికి సంబంధించిన ఎటువంటి పనులను దోమల నివారణ చర్యలుగా మురుగు కాలువల్లో ద్రావణాలు పిచికారీ చేయాల్సి ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో నీరు నిలువ ఉండి వార్డుల్లో బురద కంపు కొడుతుంది.ఈ బజారు గుండా వృద్ధులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వికలాంగులు, మహిళలు నడవాలంటే అనేక అవస్థలు పడుతూ నడవలేని పరిస్థితి నెలకొందని ఎన్ని సార్లు పంచాయతీ అధికారులకు సమస్యలను తెలియజేసినప్పటికీ పట్టించుకోవడంలేదని తమ బాధలు ఎవరికీ పట్టడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా నంద్యాల జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో డ్రెయిన్లు తవ్వ కంతో పాటు మురుగు నిల్వ లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.