
ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి
రోడ్డు భద్రత సదస్సులో డిటిసి శాంతకుమారి
కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కర్నూలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డిటిసి) అన్నారు. సోమవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 36వ రోడ్డు భద్రత మాసోత్సవాల లో భాగంగా కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సును కర్నూలు పోలీసులతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ దేశంలో అత్యధిక ప్రమాదాలు అతివేగం వల్ల జరుగుతున్నాయన్నారు. ఏడాదికి సుమారు 1,50,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారన్నారు. ఇందులో 44 శాతం 2 వీలర్ల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. మొత్తం ప్రమాదాల్లో 70% హైవేలపై జరుగుతున్నాయన్నారు. ఇందులో అత్యధికంగా యువకులే ఉన్నారన్నారు. ప్రమాదాల్లో తప్పు చేసిన వారే కాకుండా అమాయక ప్రజలు సైతం బలి అవుతున్నారన్నారు. ప్రతి ప్రయాణికుడు వాహనదారుడు వేగ పరిమితులను అనుసరించి డ్రైవింగ్ చేయాలని అన్నారు. హెల్మెట్ ను ధరించడం ద్వారా 40 శాతం పైబడి రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలు రక్షించుకోవచ్చు అన్నారు. మత్తు పదార్థాలు మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. త్రిబుల్ రైడింగ్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ధరించి డ్రైవింగ్ చేయడం, సరికాదన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెంచుకొని ఉంటారని, వినోదం కోసం చేసే చిన్న పొరపాటుతో బంగారు భవితవ్యం ఒక్కసారిగా ఆవిరి అయిపోతుందన్నారు. ఇది కన్నవారి కి కడుపు కోతను మిగులుతుందన్నారు. అంతేకాకుండా అమాయకులైన ప్రాణాలను సైతం బలిగొంటుందన్నారు. ఆర్టీవో భరత్ చవన్ మాట్లాడుతూ ప్రతి 1000 కిలోమీటర్లలో రోజుకు 2000 మంది బాధితులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. జనాభాతో పాటు రోజురోజుకు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోందని దానికి సమాంతరంగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఒకటిన్నర లక్ష నుంచి 1.60 లక్షల మంది చనిపోగా 5 లక్షల మంది గాయాల పాలవుతున్నారన్నారు. నగరంలో 25 వేల ఆటోలు 1, మోటార్ సైకిళ్ళు తిరుగుతున్నాయి అన్నారు. నిధానమే ప్రధానమని వాహనాలను వేగంగా నడపరాదని అన్నారు. చనిపోతే ఆ కొరతను ఒక్కరూ పూడ్చలేరు అన్నారు. ప్రమాదానికి గురైన వారిని కాపాడితే ప్రభుత్వం రూ 5000 రివార్డును ప్రకటిస్తుందన్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ కు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమానికి కళాశాల అడ్మినిస్ట్రేషన్ డీన్ బి వై మోహన్ అధ్యక్షత వహించగా ఎం.వి.ఐ లు సుధాకర్, నాగరాజా నాయక్, ట్రాఫిక్ సిఐ మనసురుద్దీన్ తాలూకా సిఐ శ్రీధర్, ఏ ఎం వి ఐ బాబుకిషోర్, కళాశాల విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు.