
వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేయకండి ; అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ
పీపీపీ మోడల్ దారుణం – విద్యను వ్యాపారంగా మార్చొద్దు!
తమిళనాడును చూడండి – పూర్తి ప్రభుత్వ నిధులతో వైద్య కళాశాలలు!
ప్రభుత్వ వైద్య కళాశాలల విక్రయానికి కాంగ్రెస్ వ్యతిరేకం.
ప్రైవేటీకరణ వల్ల పేదలకి వైద్య విద్య అందనంత దూరం.
ఆరోగ్య మంత్రిత్వశాఖకు కాంగ్రెస్ గట్టివాణి.
ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చే కుట్రను అడ్డుకోవాలి!
లాభార్జన కోసం విద్యను తాకట్టు పెట్టడం అన్యాయం!
పత్తికొండ, న్యూస్ వెలుగు; పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ ప్రభుత్వ వైద్య విద్యను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) మోడల్లోకి మార్చే దురుద్దేశపూరిత ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య దేశవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించిందని, ఇక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా అనేక మంది విజయవంతమైన వైద్యులు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ వైద్య కళాశాలలను కార్పొరేట్ల చేతికి అప్పగించే కుట్ర విద్యా ప్రమాణాలను పూర్తిగా నాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని ఆదోనికి వైద్య కళాశాల అత్యవసరం కాగా, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలు కావడంతో, ప్రభుత్వ నిధులతో కళాశాలను కొనసాగించడం కచ్చితంగా అవసరమని, అనుమతించిన కళాశాలను పీపీపీ మోడల్కు మార్చే కుట్ర ప్రజా వ్యతిరేకమైన నిర్ణయమని ఆక్షేపించారు. తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే వైద్య కళాశాలలను నిర్వహిస్తూ మెరుగైన వైద్య విద్యను అందిస్తోందని, మన రాష్ట్రం కూడా ఆ విధానాన్ని అనుసరించాలని సూచించారు. అయితే, ప్రభుత్వ రంగంలో వైద్య విద్య సాధ్యం కాదని ఆరోగ్య మంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయింపులు ప్రవేశపెడుతూ విద్యపై ఆంక్షలు విధించడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. కావున, పీపీపీ మోడల్ను తక్షణమే వెనక్కి తీసుకుని ప్రభుత్వ నిధులతోనే వైద్య కళాశాలలను కొనసాగించాలని పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ద్వారా గట్టిగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రానికి, భవిష్యత్ తరాలకు తీవ్రమైన ప్రమాదంగా మారనుందని, ఈ మేరకు ఆరోగ్య మంత్రికి సుదీర్ఘ లేఖ రాస్తున్నామని తెలిపారు. వైద్య విద్యను లాభార్జన మనుగడ కోసం బలిపశువుగా మార్చకూడదని, ప్రైవేటీకరణ ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్యను పూర్తిగా దూరం చేయడానికి చేసిన ఏ కుతంత్రాన్నైనా తీవ్రంగా ఎదిరిస్తామని హెచ్చరించారు.