
స్మగ్లర్లకు వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తిరుపతి (న్యూస్ వెలుగు): ఎర్రచందనం అనేది శేషాచలం అడవుల్లో తప్ప ప్రపంచంలోనే ఎక్కడా దొరకని అపురూపమైన అటవీ సంపద. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి గాయం అయినప్పుడు ఆయన రక్తంతో ఉద్భవించిన వృక్షంగా ఎర్రచందనాన్ని పురాణాలు చెబుతాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే ఈ అపురూప సంపద శేషాచలంలో తప్ప మరెక్కడా ఇంత నాణ్యతతో ఉండదు. ఇది హిందువుల మనోభావాలతో, వారి నమ్మకాలతో ముడిపడి ఉన్న గొప్ప వృక్ష సంపద. దీన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి’ అని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఎర్ర చందనం అక్రమంగా రవాణా చేసే వారంతా దీన్ని ఆపకపోతే సంవత్సరంలోగా ప్రత్యేకమైన ఆపరేషన్ ద్వారా ఎర్రచందనం అక్రమ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరినీ ఏరివేస్తామని హెచ్చరించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, ముందున్న అవకాశాలు, అవరోధాలు చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ఐదు జిల్లాల ఎస్పీలు, రెడ్ శాండర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, అటవీ అధికారులతో శనివారం తిరుపతి కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన సమావేశం తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ.. “సిద్ధాంతపరమైన భావజాలం ఉన్న వామపక్ష వాద తీవ్రవాదాన్ని దేశ శ్రేయస్సు దృష్ట్యా “ఆపరేషన్ కగార్” పేరుతో కేంద్ర ప్రభుత్వం తుడిచిపెట్టేయాలని భావిస్తోంది. మేం కూడా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. వారు స్వచ్ఛందంగా ఈ అక్రమ రవాణాను మానుకుంటే మంచిది. అలా కాకుంటే మేం కూడా కగార్ తరహా ప్రత్యేక ఆపరేషన్ ద్వారా వచ్చే ఏడాది కాలంలోనే ఎర్రచందనం స్మగ్లర్లు లేకుండా చేస్తాం. ఇది మా హెచ్చరిక. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై ఎంతగా దృష్టిపెడుతుందో, ప్రకృతి సంపదను రక్షించడంలో కూడా అంతే ప్రాధాన్యాన్ని తీసుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకంలో మేం దానికి కట్టుబడి ఉన్నాం.
కేంద్రం సహకారంతో మన సంపద మనకు వస్తోంది :
నేను కుంకి ఏనుగుల నిమిత్తం కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ అటవీ అధికారులు నాకు కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకు అని ఆరా తీస్తే.. ఆంధ్రప్రదేశ్ లో నరికి అక్రమంగా తరలించిన ఎర్రచందనం దుంగలను కర్ణాటక అటవీ అధికారులు పట్టుకొని అక్కడే వేలం వేసి, రూ. 140 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు చెప్పారు. ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేపాల్ లో ఉన్న వేలకోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను దేశ ఒప్పంద సహకారంతో వెనక్కు తీసుకురాగలిగాం. అలాంటిది రాష్ట్రాల మధ్య ఒప్పందం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంపదను ఇతర రాష్ట్రాల అధికారులు పట్టుకొని అక్కడే వేలం వేసుకుంటున్నారు. దీనిపై నేను కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ బీజేపీ గారితో మాట్లాడి, శేషాచలం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ఎర్రచందనం దేశంలో ఏ రాష్ట్రంలో దొరికిన తిరిగి ఆంధ్రప్రదేశ్ కే దక్కేలా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ అయ్యేలా చేశాను. దీంతో ఇటీవల గుజరాత్, ఢిల్లీ హర్యానా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో దొరికిన సుమారు రూ. 20 నుంచి రూ. 25 కోట్ల విలువ చేసే ఎర్రచందనం తిరిగి రాష్ట్రానికి తీసుకుని వచ్చాం. కేంద్రం సహకారంతో మన రాష్ట్ర సంపద మళ్ళీ మనకు వచ్చినట్లయింది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్దారమయ్య గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడాను. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం అని కోరాను.

నలుగురు కింగ్ పిన్స్ ను గుర్తించాం:
ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన నలుగురు కింగ్ పిన్స్ ను ప్రత్యేకంగా గుర్తించాం. వారిని ప్రత్యేక వ్యూహంతో పట్టుకుంటాం. కడపలో కొన్ని ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు ప్రత్యేకంగా ఎర్రచందనం నరకడానికి వస్తున్నారు. వారికి ఉపాధి లేకపోతే స్థానికంగా ఉండే అధికారులను కలవాలి. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఉపాధి కోసం శేషాచలంలోని విలువైన ఎర్రచందనం చెట్లను నరికితే సహించేది లేదు. ఆపరేషన్ కగార్ తరహాలోనే… ఎర్రచందనం చెట్లు నరికే అక్రమ రవాణా దారులపై కూడా ప్రత్యేక ఆపరేషన్ మొదలుపెడతాం. ఎవరైనా చెట్టు నరకాలి అంటే భయపడే పరిస్థితులు తీసుకువస్తాం. ప్రత్యేక చట్టంతో ఎర్రచందనం స్మగ్లర్లు ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం. కచ్చితంగా ఉక్కుపాదం మోపుతాం. ఇది అక్రమంగా చొరబాటయ్యే రెడ్ స్మగ్లర్లందరికీ హెచ్చరిక.
ఓ పెద్ద అడవినే కొట్టేసారు:
ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో 2014 నుంచి 2019 వరకు ఓ విధానం ఉంటే, 2019-24 మధ్య దారుణమైన విధానంతో ఎర్రచందనాన్ని ఖాళీ చేశారు. అటవీ శాఖ ప్రత్యేక గోదాములో 2 లక్షల 60 వేల దుంగలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. రెండు దుంగలు కలిపి ఒక చెట్టుగా అనుకున్నా 1లక్ష 30వేల చెట్లను నరికి వేసినట్లు అర్థమవుతుంది. సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన సంపద ఉంది. ఇది కేవలం పట్టుబడిన సరుకు మాత్రమే. 2019-24 మధ్యలో పట్టుబడకుండా తరలిపోయిన సంపద రూ. 10 వేల కోట్ల వరకు ఉండవచ్చు. దీని కట్టడికి ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తాము. ఒక్క దుంగ కూడా రాష్ట్రం దాటి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. 
ఈ ప్రత్యేక సమీక్షలో కూడా ఐదు జిల్లాల ఎస్పీలు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్, అటవీ అధికారులకు నేను చెప్పింది ఒక్కటే.. ఇకనుంచి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం మీద దృష్టి పెట్టాలి. ఇది హిందువుల మనోభావాలకు, సెంటిమెంట్ కు సంబంధించిన విషయం. చెట్టు నరకక ముందే వన సంపదను కాపాడుకుని నేరాలను నిరోధించాలి. ఎర్రచందనం అక్రమ రవాణా వల్ల తలెత్తే శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించాలి అని కోరాను. దీన్ని పకడ్బందీగా అమలు చేస్తాం” అన్నారు.
ఈ సమావేశంలో అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ శ్రీ చలపతిరావు, తిరుమల అటవీ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ శ్రీ సెల్వం, డి.ఎఫ్.ఒ. శ్రీ రవిశంకర్ శర్మ, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్ తరహాలోనే ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం
* కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని రక్త గాయం నుంచి పుట్టిన వృక్ష సంపదను కాపాడుకుందాం
* ఎర్ర చందనం స్మగ్లింగ్ లో నలుగురు కింగ్ పిన్స్ ను గుర్తించాం
* స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం చేసుకుంటాం
* వైసీపీ హయాంలో వేల కోట్ల సంపద తరలిపోయింది
* దేశంలో ఎక్కడ ఎర్రచందనం పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ కు ఆ వన సంపద చెందేలా కృషి చేశాం
* ప్రజా సంక్షేమం ప్రకృతి సంపద రక్షణ కూటమి ప్రభుత్వ ధ్యేయం
* తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్

