
సమయపాలన లేని గ్యాస్ ఏజెన్సీలు అవస్థలు పడుతున్న వినియోగదారులు
ఆదోని (న్యూస్ వెలుగు ) మార్చి 17 : ఆదోని పట్టణంలో గ్రామాల నుంచి వచ్చే గ్యాస్ వినియోగదారులు అనేక సమస్యలతో భారత్ గ్యాస్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నప్పటికీ, కార్యాలయంలో సరైన క్రమశిక్షణ, సమయపాలన లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ దూర గ్రామాల నుంచి గ్యాస్ కనెక్షన్, బుకింగ్, సబ్సిడీ, సిలిండర్ సరఫరా వంటి సమస్యలతో వినియోగదారులు కార్యాలయానికి చేరుకుంటున్నారు. అయితే కార్యాలయం నిర్ణీత సమయానికి తెరవకపోవడం, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, సమయానికి సేవలు అందించకపోవడం వంటి కారణాలతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, కూలీ కార్మికులు ఉదయం నుంచే వచ్చి సాయంత్రం వరకు తిరిగి వెళ్లాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడం కూడా ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది.
కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కార్యాలయంలో క్రమశిక్షణ, సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని వినియోగదారులు కోరుతున్నారు.


