
సమాన అవకాశాల కోసం పోరాటం చేస్తున్నాం : బురుజుల పులికొండ
పత్తికొండ (న్యూస్ వెలుగు ): స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్న దళితులు నేటికీ అంటరానితనం, వివక్షత, అసమానతలు నేటి సమాజంలో ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బురుజుల పులికొండ అన్నారు. శనివారం పత్తికొండ మండలం జూటూరు గ్రామంలో దళితులు ఆలయ ప్రవేశం చేయడం సంతోషించదగ్గ అంశం అన్నారు. సమాజంలో దళితుల సమాన అవకాశాల కోసం అనేక పోరాటాలను ఎమ్మార్పీఎస్ ద్వారా చేయడం జరుగుతుందని వారు అన్నారు. దళితుల అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
దళితులు ఆర్థిక, రాజకీయ, సామాజిక, అసమానతలు సైతం నేటి సమాజంలో ఎదుర్కొనే పరిస్థితిని నెల్కొందన్నారు. నేడు దళితులు ఆలయాల్లోకి వెళ్లేందుకు అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రలు సరికాదన్నారు. గ్రామాల్లో పౌర సేవల పైన రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు.
భారత రాజ్యాంగం దళితులకు కల్పించిన చట్టబద్ధ సౌకర్యాలు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం తగదు అన్నారు. జూటూరు గ్రామంలో ఆలయ ప్రవేశం తో పాటు వారి భద్రతకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ ప్రవేశాలను అడ్డుకునే వారిపైన పోలీసులు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళిత సంఘాలు సైతం ఏకమై పోరాటాలను ఉదృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


