వరుస మరణాలతో అంతుచిక్కని వ్యాధి : కీలక సూచనలు చేసిన సీఎం 

వరుస మరణాలతో అంతుచిక్కని వ్యాధి : కీలక సూచనలు చేసిన సీఎం 

న్యూస్ వెలుగు అమరావతి: గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో గత రెండు నెలలుగా సంభవిస్తున్న వరుస మరణాలపై సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. దీనిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలని, అనారోగ్య తీవ్రత ఎక్కువుగా ఉన్నవారిని ఆస్పత్రుల్లో చేర్పించి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న తురకపాలెం గ్రామస్థులకు ‘మెలియోయిడోసిస్’ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బ్లడ్ శాంపిల్స్ ల్యాబులకు పంపడం జరిగిందని,72 గంటల్లో రిపోర్టులు వస్తాయని సీఎంకు తెలిపారు. పశుపోషణ పైనా ఎక్కువ మంది ఆధారపడటంతో పశువుల నుంచి ఏమైనా బ్యాక్టీరియా వ్యాప్తి చెందవచ్చనే కోణంలోనూ పరిశీలన జరుపుతున్నామన్నారు.

తురకపాలెంలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు ఎక్కువుగా ఉన్నాయని, అలాగే అక్కడ ఆల్కహాల్ వినియోగం అధికంగా ఉందని, స్టోన్ క్రషర్లు ఆ ప్రాంతంలో ఎక్కువుగా ఉండటంతో వాతావరణ నాణ్యతను కూడా చెక్ చేస్తున్నామని వివరించారు. మొదట జ్వరం, దగ్గు, తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి లక్షణాలు ఎక్కువ మందిలో సాధారణంగా కనిపిస్తున్నాయని అధికారులు చెప్పారు. యాంటిబయాటిక్స్ ఆరు వారాలు నిరంతరాయంగా వాడటం వల్ల వ్యాధి నియంత్రణలోకి వస్తోందని చెప్పారు. దీనిపైన మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ కూడా పరిశోధన చేస్తోందని తెలిపారు. ‘ఎయిమ్స్‘ సహా కేంద్ర వైద్య బృందాలు రప్పించాలని, అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సాయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!