
మంత్రి నారా లోకేష్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
రాంబిల్లి, న్యూస్ వెలుగు : రాంబిల్లి మండలం, లాలంకోడూరు పంచాయతీ పరిధిలోని సీతపాలెం వద్ద బ్లూ జెట్ ఫార్మా (Blue Jet Pharma) కంపెనీ ఈనెల 28వ తేదీన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ పర్యటన నిమిత్తం భద్రతా ఏర్పాట్లను పోలీసు యంత్రాంగం ముమ్మరం చేసింది.బుధవారం నాడు విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి , జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా కలిసి పర్యటన ప్రాంతాన్ని సందర్శించి, భద్రతా బందోబస్తుపై స్థానిక పోలీసు అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు.మంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యున్నత స్థాయి భద్రతను ఏర్పాటు చేయాలని ఐజీ ఆదేశించారు.
రూట్ మ్యాప్ పరిశీలన: సభా ప్రాంగణం, హెలిప్యాడ్ మరియు కంపెనీ పరిసర ప్రాంతాలను పరిశీలించి, ట్రాఫిక్ మళ్లింపు బందోబస్తు పాయింట్లపై దిశానిర్దేశం చేశారు. వివిఐపి పర్యటన దృష్ట్యా వివిధ విభాగాల పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, ఎస్.బి డీఎస్పీ జి.ఆర్.ఆర్. మోహన్, పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్, నర్సీపట్నం డీఎస్పీ శ్రీ పి. శ్రీనివాసరావు, రాంబిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింగరావు, అచ్యుతాపురం ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, పరవాడ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి పర్యటనను విజయవంతం చేసేలా పౌర ఇబ్బందులు లేకుండా భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు ఐజీ ఈ సందర్భంగా వెల్లడించారు.

