
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
నరనస్నపేట, ( న్యూస్ వెలుగు )మే 16: గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్దిపై వేటు పడిందని, ప్రజా ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లకుండా ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేలా సంకల్పం తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర తో పాటు రాయల సీమ కోస్తా జిల్లాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రోజుకు ఓ డ్రామాతో వచ్చే వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని తామ్రపల్లిలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజా వేదిక సభలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించారు. “రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతోనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టాం. స్వచ్ఛపథం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లోని రహదారులను శుభ్రపరిచేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రతినెలా ఒకటో తేదీన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని అర్హులకు స్వయంగా పింఛన్లు అందించడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతోంది. పేదరికం లేని సమాజం , ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. పిల్లలే సంపద అని పిలుపునిస్తున్నాను. అందుకే మూడు, నాలుగో సంతానానికి ప్రోత్సాహకం అందించేలా నిర్ణయం తీసుకుంటున్నాం. మూడో సంతానానికి 30 వేలు, నాలుగో సంతానానికి 40 వేలు ప్రోత్సాహకం ఇస్తాం. అంగన్వాడీలను బలోపేతం చేస్తున్నాం. తల్లికి వందనం కింద రూ. 15 వేలు ఆర్థిక సాయం చేస్తున్నాం. రీ సర్వే ద్వారా భూముల రికార్డులు ప్రక్షాళన చేస్తున్నాం. ఎవరూ ట్యాంపరింగ్ చేసే అవకాశం లేకుండా ఆధునిక టెక్నాలజీని వినియోగించి పట్టదారు పాస్ పుస్తకాలను ముద్రించి అందిస్తున్నాం. 2027 మార్చి నాటికి రాష్ట్రంలో ఎక్కడా భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని” ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
సగర్వంగా స్వచ్ఛత వైపు అడుగులు:
“17 నెలలుగా మనం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేస్తున్నాం. పరిసరాలు, పరిశుభ్రత విషయంలో మార్పు కనిపిస్తోంది. మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటే మన అలవాట్లు మారుతాయి. అలవాట్లు మారితే సమాజం మారుతుంది. సమాజం మారితేనే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుంది. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రస్తుతం మన తలసరి ఆదాయం రూ. 3 లక్షలు. దీన్ని రాబోయే 22 ఏళ్లలో రూ. 54 లక్షలు చేయాలనే దిశగా ముందుకెళ్తున్నాం. పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు పీ4 తీసుకొచ్చాం. పైన ఉండే 10 శాతం మంది కింద ఉండే 20 శాతం మందిని ఆర్థికంగా పైకి తీసుకు రావాలి. 2047 నాటికి మనదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుంది. ఆ దిశగా ప్రదాని మోదీ ముందుకెళ్తున్నారని” సీఎం చంద్రబాబు అన్నారు.
జూన్ నాటికి 100 శాతం చెత్త శుభ్రం:
“ప్రజా ప్రభుత్వం వచ్చాక 86 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్ చేశాం. ఈ 23 నెలల్లో 121 లక్షల టన్నుల చెత్త తొలగించాం. జూన్ కల్లా వందశాతం పూర్తవుతుంది. డోర్ టు డోర్ కలెక్షన్ ద్వారా ప్రతీ రోజూ పట్టణాల్లో 7,527 టన్నులు, గ్రామాల్లో 1,430 టన్నుల చెత్తను సేకరిస్తున్నాం. రూ.1,254 కోట్లతో 6 వేస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టులు 6 సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. చెత్త ప్రాసెసింగ్ కోసం రూ.603 కోట్లతో 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు సిద్దం చేస్తున్నాం. ఇవి అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తే డంపింగ్ యార్డ్ అనేదే ఉండదు. నెట్ జీరో క్యాంపస్ లో భాగంగా హాస్టళ్ల నుంచి వ్యర్థాలు లేకుండా ప్రణాళిక చేశాం, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి, కిచెన్ గార్డెన్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, కంపోస్టింగ్, వాటర్ టెస్ట్ కిట్స్, ముస్తాబు వంటివి అమలుచేస్తున్నాం. ప్రతీ నెలా 10, 20 తేదీల్లో ఈ-వ్యర్థాలు సేకరిస్తున్నాం. చెత్త సేకరణకు 200 ఈ-ఆటోలు వినియోగిస్తున్నాం. ఈ నెలాఖరు కల్లా కొత్తగా 5,000 పుష్ కార్ట్స్, 12,000 ట్రై సైకిళ్లు తెస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం 31.33 శాతం గ్రీన్ కవర్ ఉంది. 2030 నాటికి 37 శాతానికి, 2047 కల్లా 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 633 స్వచ్ఛ రథాలతో రోజుకు 125 టన్నుల పొడి చెత్త సేకరిస్తున్నాం. ఇప్పటికి 47 లక్షల కేజీల చెత్తను సేకరించి రూ.8 కోట్ల విలువైన నిత్యావసరాలు ఇచ్చారు. కొత్తగా గ్రీన్ షాప్స్ ను ప్రారంభించాం. ప్రజలే అక్కడికి వెళ్లి ప్లాస్టిక్, ఐరన్ వంటి వ్యర్థాలను ఇచ్చి…వస్తువులు పొందవచ్చు. వావ్ పేరుతో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరులలో సర్క్యులర్ ఎకానమీ పార్కులు నిర్మిస్తున్నాం. నేటి నుంచి 50 ప్లాస్టిక్ వ్యర్థ యూనిట్లు వస్తుండగా మరో 210 యూనిట్లు జూన్కి అందుబాటులోకి తెస్తామని” ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రానికి మరిన్ని అవార్డులు రావాలి:
“మన ఇల్లే కాదు. చుట్టూ ఉన్న పరిసరాలు, మన రహదారులను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు గ్రామాలు, పట్టణాల్లో ఊరి చివర్లో ఎక్కడ చూసినా చెత్తా-చెదారం కనిపించేది. అప్పుడే రహదారులను పరిశుభ్రంగా మార్చాలని నిర్ణయించుకున్నాను. అందుకే స్వచ్ఛపథం పేరిట ఇప్పుడు కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మురుగునీరు వ్యర్ధాలు పొంగిపొర్లకుండా మ్యాజిక్ డ్రైన్లను నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను కూడా మనం వాడకుండా నిషేధం విధించుకోవాల్సిన అవసరం ఉంది. అత్యుత్తమ విధానాలను అనుసరించటం ద్వారా రాష్ట్రంలోని పంచాయితీలకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. కందులవారి పల్లె, చిత్తూరు జిల్లా, కాణిపాకం ఇలా వేర్వేరు పంచాయితీలు అత్యుత్తమ పనితీరు కనబరచడం ప్రభుత్వం చేస్తోన్న కృషికి దక్కిన ఫలితంగా భావిస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించే ఈ శాఖలో జాతీయ స్థాయిలో 8 అవార్డులు వచ్చాయి. మరిన్ని అవార్డులను రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు దక్కించు కోవాలని కోరుతున్నాను. ఇవాల్టి నుంచి ఆపరేషన్ క్లీన్ స్వీప్ రాష్ట్రంలో ప్రారంభం అవుతుంది. నెలరోజు పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. నాలుగు వారాల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మున్సిపాలిటీలు కూడా స్వచ్ఛతా అవార్డులు దక్కించుకుంటాయని ఆకాంక్షిస్తున్నానని” ముఖ్యమంత్రి తెలిపారు.
అధికారం అంటే విధ్వంసం కాదు:
“శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టబుడులకు ఒప్పందాలు కుదిరాయి. ప్రతి ఒప్పందం కార్యరూపం దాల్చుతోంది. వీటి ద్వారా రానున్న రోజుల్లో 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి. నిన్ననే పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నాం. కేవలం 36 రోజుల్లో అనుమతులు తెచ్చి, భూములు ఇచ్చి దేశం గర్వించే డిఫెన్స్ ప్రాజెక్టును సాధించడం మన ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనం. అధికారం అంటే విధ్వంసం కాదు. ప్రజల జీవితాలు మార్చే అవకాశం అని నమ్ముతున్నాం. అధికారం అంటే విశాఖకు గూగుల్ తేవడం, అమరావతికి క్వాంటం తేవడం, సీమకు డిఫెన్స్ ప్రాజెక్టు తేవడం. ఇకపై ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు..ఉత్తరాంధ్రకే వలస వస్తారు దేశంలో ఎక్కడికి పోయినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఐటీ కంపెనీలు, డాటా సెంటర్లతో ఉత్తరాంధ్ర దశ మారుతుంది. సాగునీటి ప్రాజెక్టులతో దిశ మారుతుంది. దాదాపు రూ.1 లక్ష కోట్లతో రిలయన్స్ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలతో పాటు ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, రెన్యూపవర్ గ్రీన్ ఎనర్జీ వంటి ప్రముఖ కంపెనీలు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టాయి. జూలైలో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభించుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాకు మరో ఎయిర్ పోర్టు తీసుకువస్తాం. పలాసలో కొత్త ఎయిర్ పోర్ట్ ను కూడా త్వరలో నిర్మాణం చేపడతాం. మూలపేట పోర్టు ఉత్తరాంధ్రకే అడ్వాంటేజ్ అవుతుంది. ఈ ఏడాదిలోనే మూలపేట పోర్టును ప్రారంభిస్తాం”. అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తాం:
“రాష్ట్రంలో ఎక్కువ జాతీయ రహదారి, సముద్ర తీరం, నీరు, తెలివైన ప్రజలు ఉండే జిల్లా శ్రీకాకుళం. కానీ అభివృద్దిలో వెనుకుంది. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తాం. ఉత్తరాంధ్ర ఇన్ఫ్రా ప్రాజెక్టులతో పాటు సాగునీటి ప్రాజెక్టులపైనా దృష్టిపెట్టాం. ఉత్తరాంధ్రలో ఏ ప్రాజెక్టును ఎప్పటికల్లా పూర్తి చేయాలో ఇరిగేషన్ క్యాలెండర్ ఇచ్చాం. మద్దువలస స్టేజ్-2 జనవరి 2027, హిరమండలం ఎత్తిపోతల పథకం ఏప్రిల్ 2027, వంశధార ఫేజ్-2 స్టేజ్-2 (హిరమండలం రిజర్వాయర్) జూలై 2027, తోటపల్లి డిస్ట్రిబ్యూటరీస్ జూలై 2027, జంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్ డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నేరడి బ్యారేజ్ కు అడ్డంకులు తొలగి కేంద్రం నుంచి అనుమతులు సాధించాం. నవంబర్లో శంకుస్థాపన చేస్తాం. రాబోయే మూడేళ్లలో నేరేడి ప్రాజెక్టు పూర్తిచేస్తామని” ముఖ్యమంత్రి తెలిపారు.
గొడ్డలి పార్టీతో అప్రమత్తంగా ఉండాలి:
“ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలని, దేశంలో ఏపీ నెంబర్ వన్ స్టేట్ కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రజలాంతా ఆలోచించాలి. 23 నెలల క్రితం వరకు ఉత్తరాంధ్రలో ఏమీ లేవు. నాటి పాలనలో ఎక్కడ చూసినా ప్రభుత్వ టెర్రరిజం, కబ్జాలు, బెదిరింపులు, కేసులు, అరాచకాలే. అచ్చెన్నాయుడు లాంటి నేతల్ని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేశారు. గడిచిన ఐదేళ్లలో ప్రజల్లో అశాంతి, అలజడి, అభద్రత నెలకొంది. ఎవరి ఆస్తి ఎప్పుడు కబ్జా చేస్తారో తెలీని పరిస్థితి. అనేక వనరులున్నప్పటికీ గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్దికి వేటు పడింది. అన్నింటినీ సరిచేసి ఏపీకి మళ్లీ బ్రాండ్ క్రియేట్ చేశాం. గొడ్డలి పార్టీ నాయకులు కులాలు, మతాలు, ప్రాంతాలు మధ్య చిచ్చు పెడతారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారంతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం దేశంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే రాష్ట్రాల్లో ఏపీ 2వ స్థానంలో ఉందంటే గొడ్డలి పార్టీనే కారణం. పంపకాల్లో తేడాలు వస్తే సొంత వాళ్లను చంపేసి మళ్లీ మాపై బురద వేస్తారు. సొంత బాబాయ్ ని చంపి ఆ నేరం నాపై మోపారు. గొడ్డలి ప్లస్ అంటూ కొత్త నాటకాలతో వస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఒక పిలుపునిస్తే పాటించడంలో ఉత్తరాంధ్ర వాళ్లు ముందుంటారు. హుద్ హుద్ సమయంలో దీపావళి టపాసులు వద్దు అని చెపితే…చిన్న క్రాకర్ కూడా కాల్చలేదు. అదీ మీ నిబద్దత”అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ప్రధాని సూచనలు పాటిద్దాం:
“యుద్ద ప్రభావం కారణంగా ప్రధాని మోదీ చేసిన సూచనలను బాధ్యత గల పౌరులుగా అందరం పాటించి దేశానికి సహకరిద్దాం. వర్క్ ఫ్రం హోం అలవాటు చేసుకుని వీలైనంతవరకూ ఇంట్లో నుంచే పనిచేద్దాం. బంగారం కొనడం తగ్గిద్దాం. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లోనే ప్రయాణిద్దాం. వంట నూనెల వాడకం తగ్గిద్దాం. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిద్దాం. మేడిన్ ఆంధ్రా, మేడిన్ ఇండియా బ్రాండ్లను కొనుగోలు చేద్దాం. టూరిజం కోసం విదేశీ పర్యటనల కంటే ఏపీ లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్ళాలి”అని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా పర్యటనలో పొదుపు చర్యల్లో భాగంగా సీఎం నాలుగు వాహనాల కాన్వాయ్ లో మాత్రమే ప్రయాణించారు. శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట నియోజకవర్గ అభివృద్ధి నివేదికను సీఎం చంద్రబాబు ప్రజలకు చదివి వినిపించారు. వివిధ శాఖల పనితీరును ప్రజలకు వివరించారు. నియోజకవర్గ పరిధిలోని రాజులచెరువు ఆధునీకరణకు నిధులు మంజూరు చేస్తామని, ఎన్ హెచ్ 5 నుంచి నరసన్నపేట పట్టణ పరిధిలో రూ. 15 కోట్లు వ్యయంతో రహదారి నిర్మాణం చేపడతామని, కింజరాపు ఎర్రన్నాయుడు చిల్ట్రన్ పార్క్ ఏర్పాటు చేస్తామని , శ్రీముఖ లింగం ఆలయ ఉత్సవాలను ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం తిలకించారు. అక్కడ సీతంపేట ఐటీడిఏ ఆధ్వర్యంలో గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసిన సవర ఆర్ట్ ఓవర్ కోటు ను ముఖ్యమంత్రి ధరించారు. పోలీసులు ఏర్పాటు చేసిన హెల్మెట్ బ్యాంక్ ను చూసి సీఎం అభినందించారు. హెల్మెట్ ధరించి అక్కడే ఉన్న బుల్లెట్ వాహనం అధిరోహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

